Wednesday, August 20, 2014

జూన్ 29న డిట్రాయిట్ నగరంలో జరిగిన పాడుతా తీయగా గురించి...

పాడుతా తీయగా అంటూ తెలుగు ప్రజల గుండె గూటిలో పక్క వేసుకొని పక్కాగా స్థిరపడిపోయిన మన గాన గంధర్వుడు బాలు ముఖ్య అతిథి, మధురగాయకుడు మనో తో కలిసి  pre finals కోసం డిట్రాయిట్ వచ్చారు. ఇక డిట్రాయిట్ తెలుగు వారంతా వింటాం వీనుల విందుగా బల్ పసందుగా అంటూ కుటుంబాలతో ఈ  కార్యక్రమం జరుగుతున్న Ford Community and Performing Arts Center కు తరలి వచ్చారు.  మూడు సంచికలుగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. ఇందులో నిఖిత, సుమేథ, శ్రీవిష్ణుప్రియ, స్నేహ, మేఘన పాల్గొని బాలగంధర్వులనిపించేలా వారు పాడిన పాటలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. మొదటి సంచికలో మధ్య కాల మాధుర్యాలు (mid melodies), రెండవ సంచికలో సినిమాలలో రాని అన్నమయ్య కీర్తనలు, ఆఖరి సంచికలో సినిమా పాటలు విషయాలుగా ఉన్నాయి. 

మొదటి సంచిక ఆరంభంలో నాట్స్ అధ్యక్షులు శ్రీ గంగాధర్ దేసు గారు  మాట్లాడుతూ నాట్స్ కార్యక్రమాలను, వివిధ సందర్భాలలో ఉత్తర అమెరికాలోని తెలుగువారికి నాట్స్ చేసిన సేవలను  వివరించారు. 
రెండవ సంచిక చివరలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి సహకరించిన sponsors here అందరికీ బాలు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ గంగాధర్ గారు DTA కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. 
ప్రతి సంచికను ప్రారంభించేముందు బాలు స్థల పురాణంగా డిట్రాయిట్ గురించి, ముఖ్య అతిథి మనో గారి గురించి వివరించారు.  తను 1977-78 లో మొదటిసారి డిట్రాయిట్ వచ్చినప్పుదు ఇదే హాలులో సుశీలమ్మ గారితో కలిసి తన కచేరీ జరిగిన విషయాన్ని తలచుకున్నారు.  
అమెరికాలో పుట్టిపెరిగిన ఈ పిల్లలు ఇంత స్వచ్చంగా ఉచ్చారణ దోషాలు లేకుండా పాడటం బాలు గారిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి పాట తరువాత బాలు గారు ఆ పాటలోని బాగోగులను వివరించిన తీరు, పిల్లలకు మార్గదర్శనం చేసిన విధం అందరినీ ఆకట్టుకుంది. పాడుతా తీయగా కార్యక్రమం భావి గాయకులకు ఇంత స్ఫూర్తిదాయకంగా ఎందుకు ఉందో ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం మా డిట్రాయిట్ వాసులకు కలిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 
పాడటానికి వచ్చిన పిల్లలందరినీ చప్పట్లతో స్వాగతం పలికారు. ముఖ్యంగా స్థానికురాలు సుమేథ పాడటానికి రాగానే హాలు దద్దరిల్లిపోయింది.
ఈ మూడు సంచికలలో పాడిన పాటలకు వచ్చిన మార్కుల సగటు ఆధారంగా సుమేథ మినహా మిగతా నలుగురు finals కు వెళ్ళారు. 
ఈ prefinals లో బయటకు వెళ్ళాల్సి వచ్చిన సుమేథకు నాట్స్ తరఫున శ్రీ గౌతం మార్నేని, శ్రీ కొడాలి కిషోర్ గార్లు 500డాలర్ల చెక్కును బహూకరించారు. 
తర్వాత నాట్స్ జాతీయ సెక్రటరి శ్రీ బసవేంద్ర సూరపనేని గారు తన సహచరులు కృష్ణ కొత్తపల్లి, గౌతం మార్నేని, కిషోర్ కొడాలి,  శ్రీని కొడాలి, శేఖర్ దేవరసెట్టి, భాస్కర్ వారణాసి, శివ అడుసుమిల్లి, కృష్ణ నిచ్చెనమెట్ల, సుభాష్ రౌతు, నాగేంద్ర కొలిపాక గార్లను సభకు పరిచయం చేశారు. బాలు గారి స్వస్తి వాచకాలతో చివరి సంచిక ముగిసింది


No comments: